MLC Bhageeratha Reddy : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ చల్లా భగీరథ రెడ్డి మరణించారు. గత కొద్ది రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు తుది శ్వాస విడిచారు. రెండు రోజుల క్రితం తీవ్ర అనారోగ్యానికి గురి కావడంతో మెరుగైన చికిత్స కోసం భగీరథ రెడ్డిని ఆయన కుటుంబ సభ్యులు హైదరాబాద్ కు తరలించారు. పరిస్థితి విషమించడంతో ఆయన మృతి చెందినట్లు తెలుస్తుంది. మాజీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణా రెడ్డి సంతానమే చల్లా భగీరథ రెడ్డి. చల్లా భగీరథ రెడ్డి 1976 ఆగస్టు 30న జన్మించారు. ఓయూ నుంచి ఎంఏ పొలిటికల్ సైన్స్ చేశారు.
చల్లా రామకృష్ణా రెడ్డి వారసుడిగా భగీరథ రెడ్డి రాజకీయాల్లోకి వచ్చారు. చల్లా రామకృష్ణారెడ్డి స్వగ్రామం అవుకు మండలంలోని ఉప్పలపాడు. 2020 డిసెంబర్ 31న చల్లా రామకృష్ణా రెడ్డి కరోనా బారినపడి మృతి చెందారు. ఆ తర్వాత ఈ ఏడాది మార్చిలో ఆయన కుమారుడైన భగీరథ రెడ్డి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. భగీరథ రెడ్డి ఎమ్మెల్సీగా 18 నెలలు కొనసాగారు. చల్లా భగీరథ రెడ్డికి భార్య చల్లా శ్రీలక్ష్మి, ఇద్దరు కుమారులు (చల్లా రాజాబి శేఖర్ రెడ్డి, చల్లా రామకృష్ణా రెడ్డి). చల్లా భగీరథ రెడ్డి భార్య చల్లా శ్రీలక్ష్మి అవుకు జడ్పీటీసీగా కొనసాగుతున్నారు. ఇప్పుడు న్యుమోనియా వ్యాధితో బాధపడుతూ భగీరథ రెడ్డి కూడా కన్నుమూశారు. దీంతో, చల్లా కుటుంబం కన్నీరుమున్నీరవుతోంది. అవుకులో విషాదఛాయలు అలుముకున్నాయి.
రేపు తెల్లవారుజామున భగీరథ రెడ్డి పార్థివదేహాన్ని అవుకు తరలించనున్నారు. రేపు సాయంత్రం అవుకులోని చల్లా ఫామ్హౌస్లో చల్లా భగీరథ రెడ్డి భౌతికకాయానికి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. గతంలో భగీరథ రెడ్డి 2003 నుంచి 2009 వరకు యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. 2007-08 మధ్య ఆలిండియా యూత్ కాంగ్రెస్ కార్యదర్శిగా పనిచేశారు. 2019లో తండ్రితో కలిసి వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. చల్లా కుటుంబం టీడీపీ, కాంగ్రెస్ పార్టీల్లో పని చేసింది.