తమ బిడ్డకు పేరు పెట్టుకోవాలనే ఆ తల్లిదండ్రుల తొమ్మిదేండ్ల కల తెలంగాణ సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఫలించింది. వివరాల్లోకి వెళితే.. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలంగా పనిచేసిన భూపాలపల్లి మండలం, నందిగామ గ్రామానికి చెందిన సురేశ్, అనిత దంపతులు 2013లో ఆడ బిడ్డకు జన్మనిచ్చారు.
తమ బిడ్డకు నాటి ఉద్యమ రథసారథి, నేటి సీఎం కేసీఆర్తోనే నామకరణం చేయించుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆ ఆడపిల్లకు ఇప్పటిదాకా పేరు పెట్టకుండానే పెంచుకుంటూ వచ్చారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ స్పీకర్, ఎమ్మెల్సీ మధుసూధనాచారి తల్లిదండ్రులను, బిడ్డను ప్రగతి భవన్కు తీసుకెళ్లారు.
దీంతో కేసీఆర్ దంపతులు.. సురేష్, అనిత దంపతులను దీవించి వారి తొమ్మిదేండ్ల ఆడబిడ్డకు ‘మహతి’ అని నామకరణం చేశారు. తమ ఇంటికి వచ్చిన వారికి స్వయంగా సీఎం దంపతులు దుస్తులు పెట్టి సంప్రదాయ పద్దతిలో ఆతిథ్యమిచ్చారు. బిడ్డ చదువుకోసం ఆర్థిక సాయాన్నందించారు. తమ తొమ్మిదేండ్ల కల ఫలించడమే కాకుండా, ఊహించని రీతిలో సీఎం దంపతులు తమను ఆదరించి దీవించిన తీరుకు సురేష్ కుటుంబం సంభ్రమాశ్చర్యాలకు లోనయింది. ఈ సందర్భంగా వారు సీఎం దంపతులకు తమ కృతజ్ఞతలు తెలిపారు.