Nara Lokesh : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో కీలక ఘట్టానికి తెరలేవనుంది. టీడీపీ నేత నారా లోకేశ్ పాదయాత్ర చేసేందుకు సిద్ధమయ్యారు. కాగా 2023 జనవరి 27 నుంచి లోకేశ్ పాదయాత్ర ప్రారంభం కానుంది. చిత్తూరు జిల్లా కుప్పం నుంచి శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం వరకు ఈ పాదయాత్ర జరగనుంది. లోకేశ్ పాదయాత్రలో ప్రజలను కలుస్తూ వారి సమస్యలు తెలుసుకుని… పరిష్కరించేందుకు ప్రయత్నాలు చేయనున్నారు. అలానే పలు బహిరంగ సభ ల్లోనూ ఆయన పాల్గొని ప్రసంగించే అవకాశం ఉందని సమాచారం అందుతుంది. సంవత్సరం పాటు ప్రజల్లోనే ఉండేలా ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు.
కాగా ఇప్పటికే ఈ పాదయాత్రకు సంబంధించిన రూట్ మ్యాప్ ను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. అయితే లోకేశ్ పాదయాత్ర చేపడతారని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతున్నప్పటికీ ఈ విషయంపై ఇప్పటి వరకు స్పష్టత లేదు. తాజాగా ఈ విషయాన్ని లోకేశ్ స్వయంగా ప్రకటించడంతో ఆ విషయంపై క్లారిటీ వచ్చేసింది. దీంతో టీడీపీ నేతలు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జనవరి 26న హైదరాబాద్ లోని తన నివాసం నుంచి కుప్పంకు లోకేశ్ వెళ్ళి… 27న పాదయాత్రను ప్రారంభిస్తారు. పాదయాత్రకు సంబంధించి పలు టీమ్ లను ఏర్పాటు చేసే దిశగా టీడీపీ సీనియర్ నేతలతో చంద్రబాబు చర్చలు జరిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
మరోవైపు పాదయాత్ర చేపట్టి అధికారం కైవసం చేసుకున్న ఘటనలు తెలుగు రాష్ట్రాల్లో చోటు చేసుకున్నాయి. గతంలో మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి, ప్రస్తుత ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేపట్టి అధికారం చేజిక్కించుకున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర పేరుతో పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే.