Twitter : ప్రముఖ సామాజిక మాద్యమం ట్విట్టర్ గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. ప్రపంచ వ్యాప్తంగా కోట్లలో ట్విట్టర్ ను వినియోగిస్తూ ఉంటారు. కాగా ట్విట్టర్ ను సొంతం చేసుకున్న కొద్ది రోజుల్లోనే కఠినమైన మార్పులు చేపట్టిన ఎలాన్ మస్క్ … బ్లూటిక్కు ఛార్జీలు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పటికే అమెరికా , యూకే సహా కొన్ని దేశాల్లో ఈ ఛార్జీలు అమల్లోకి రాగా… తాజాగా భారత్ లోనూ ఛార్జీలు ప్రారంభమైనట్లు తెలుస్తోంది. భారత్లో ఈ సబ్స్క్రిప్షన్ ను నెలకు రూ. 719 గా నిర్ణయించారట. అయితే ప్రస్తుతానికి ఐఓఎస్ యూజర్లకు మాత్రమే ఈ మెసేజ్లు వచ్చినట్లు తెలుస్తోంది.
రాబోయే రోజుల్లో అందరికీ ఈ ఛార్జీలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు సమాచారం. బ్లూటిక్ సబ్స్క్రిప్షన్ మెసేజ్లు వచ్చిన యూజర్లు కొందరు వాటిని స్క్రీన్షాట్లు తీసి ట్విటర్లో పోస్టు చేస్తున్నారు. అందులో నెలవారీ ఛార్జీ రూ.719గా కన్పించింది. బ్లూటిక్ కొనసాగించుకోవాలంటే ఖాతాదారులు ఈ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. వద్దనుకుంటే ఈ ఫీచర్ను రద్దు చేసుకోవచ్చు. అయితే ట్విటర్ బ్లూ కోసం ఈ సబ్స్క్రిప్షన్ చెల్లించినవారికి ఎలాంటి వెరిఫికేషన్ లేకుండానే బ్లూటిక్ వస్తుంది.
దీంతో పాటు ఈ బ్లూటిక్ ఖాతాదారులకు మరిన్ని ప్రయోజనాలు కూడా ఉండనున్నట్లు ఎలాన్ మస్క్ ఇప్పటికే వెల్లడించారు. అయితే ఇలా వెరిఫికేషన్ లేకుండా ఇవ్వడం వల్ల నకిలీ ఖాతాలు పెరిగే ప్రమాదముందని ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలోనే కొందరు ముఖ్య వ్యక్తులను గుర్తించేందుకు ‘అఫీషియల్’ గుర్తును ట్విటర్ తీసుకొచ్చింది. అయితే.. ఈ గుర్తు చాలా మంది ప్రభుత్వేతర వ్యక్తుల ఖాతాల్లోనూ కనిపించడంతో గందరగోళం నెలకొంది. దీంతో కొన్ని గంటల్లోనే ‘అఫీషియల్’ గుర్తును వెనక్కి తీసుకుంటున్నట్లు ట్విటర్ ప్రకటించిన విషయం తెలిసిందే.