వారు నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల తరుపున.. 70 లక్షల మంది రైతు కుటుంబాల తరఫున ప్రజా ప్రతినిధులుగా ఢిల్లీకి వచ్చారు. అలాంటివారిని “మీకేం పనిలేదా” అని అవమానిస్తారా? ఇది తెలంగాణ రైతులను, తెలంగాణ ప్రజలను అవమాన పరచడమే, పీయూష్ గోయల్ చేసిన వ్యాఖ్యలు తక్షణం ఉపసంహరించు కావాలి… వెంటనే తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి, ఆయన కేంద్ర మంత్రిగా కాకుండా రాజకీయ నాయకుడిగా మాత్రమే వ్యవహరించారు, ఒక రాష్ట్రానికి సంబంధించి ఆరుగురు మంత్రుల కంటే ఇంకా పెద్ద డెలిగేషన్ ఉంటుందా? రాష్ట్ర ప్రతినిధుల బృందాన్ని కలువకుండా ముందు మీ బీజేపీ నేతలను పిలిపించుకుని మాట్లాడతావా? కలుస్తవా లేదా… మీ పార్టీ నాయకులను ముందు కలుస్తావా.. మీ ప్రాధాన్యం ఏంటి?
అబద్ధాలు, అసత్య ప్రచారాలు, అభాండాలు, గోబెల్స్ ప్రచారం తో రాజకీయం చేసింది నువ్వు. మీ ప్రాధాన్యం రాజకీయం.. మా ప్రాధాన్యం రైతులు… ధాన్యం కొంటారా కొనరా.. చెప్పండి అని మంత్రుల బృందం వస్తె.. కలవడానికి సమయం లేదు అంటారా. వానాకాలంలో మీరు ఇచ్చిన 40 LMT టార్గెట్ పూర్తయింది. ఇప్పటికే యాభై లక్షల మెట్రిక్ టన్నులు కొన్నాం. మరో ముప్పై లక్షల మెట్రిక్ టన్నులు వచ్చేలా ఉంది. రైతులు చలిలో కల్లాల దగ్గర ఉంటున్నారు. వీటిని కొంటారా కొనరా అని అడగడానికి మంత్రులు వస్తే అవమానిస్తారా, యాసంగి లో బాయిల్డ్ రైస్ కొనమని చెప్పారు.. భవిష్యత్తులో రా రైస్ కూడా కొనం అంటే ఏం చేయాలి?
టీఆరెఎస్ పుట్టిందే తెలంగాణ కోసం. రాష్ట్ర రైతు ప్రయోజనాల కంటే మాకు ఏది ముఖ్యం కాదు. అందుకే డిల్లీ వచ్చాం. మాట తప్పింది మీరు.. మాట మార్చింది మీరు. మళ్ళీ మేము రాజకీయం చేస్తున్నాం అంటున్నారు, రాష్ట్ర ఏర్పాటు విషయంలో నాడు కాకినాడ తీర్మానం చేసి వెనక్కి తగ్గింది బీజేపీ కాదా? ఒక్క ఓటు రెండు రాష్ట్రాల సిద్ధాంతం మీది, ఎవరు రాజకీయం చేస్తున్నారో.. రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని మంట కలిపే విధంగా పీయూష్ గోయల్ చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలి. రైతులకు క్షమాపణ చెప్పాలి.
దేశం మొత్తం ఒకే విధానం ఉండాలని మేము అంటున్నాం. పంజాబ్ లో మొత్తం కొంటున్నట్లే.. మా దగ్గర కొనాలి అంటున్నాం. దానికి సమాధానం చెప్పకుండా… డొంక తిరుగుడుగా మాట్లాడుతున్నారు, విద్యుత్, సాగునీరు రాష్ట్రాల బాధ్యత. మా పని మేము వంద శాతం చేస్తున్నాం. ప్రపంచంలో ఎక్కడా లేనవిధంగా ఉచిత కరెంట్, రైతు బంధు, రైతు బీమా ఇస్తున్నాం. గోదాములు కట్టాం, మార్కెట్లు అభివృద్ధి చేశాం. రైతులకు ఎరువులు విత్తనాలను సకాలంలో అందేలా చేస్తున్నాం, పంటల కొనుగోళ్ళు కేంద్రం పరిధిలో ఉంది. మీరు మీ బాధ్యతను విస్మరించారు. చేతకాకపోతే రాష్ట్రాలకు అధికారాలు బదిలీ చేయండి. మావల్ల కాదు అని మీరు చేతులెత్తేస్తే రైతులే గుణపాఠం చెబుతారు.పట్టపగలు రైతుల మీద కార్లు ఎక్కించి చంపిన కేంద్ర మంత్రి కొడుకును సిట్ నివేదిక ఇచ్చినా ఎందుకు అరెస్ట్ చేయలేదు. రైతులపై మీకున్న గౌరవం అది, ఎన్నికల్లో మీరు ఓడిపోలేదా… ఎందుకు అంత విర్ర వీగుతున్నరు. ఇటీవల ఎన్నికల్లో ఎన్ని సిట్టింగ్ స్థానాలు కోల్పోలేదు. ఎమ్మెల్సీగా రామచంద్రరావు ఓడిపోలేదా? వానాకాలం ధాన్యం కొనుగోలు విషయంలో మాట్లాడరు, వచ్చే యాసంగి ధాన్యం కొనుగోలు గురించి మాట్లాడరు. ఇంకా పైగా అసత్య ప్రచారం చేస్తున్నారు.
వడ్లు కొంటవా… కొనవా ఒక్క మాట చెప్పు, ముఖ్యమత్రి గారు ఎంతో కష్టపడి రైతులను ఆదుకుంటే.. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఆడుకుంటోంది. నోటి తో మాట్లాడి నొసటితో వెక్కిరించినట్లు చేస్తోంది, బియ్యం రవాణా ఆలస్యం అవుతున్నదని నా దృష్టికి వస్తె నేను ఉమ్మడి జిల్లా మంత్రిగా గతంలో FCI జనరల్ మేనేజర్ ను ఇంటికి పిలిచాను. టిఫిన్ పెట్టి 2 గంటలు బతిలాడిన. కలెక్టర్లు, అధికారులు, మిల్లర్లు తమ సమస్యలు చెప్పారు. ఎలాగైనా పైవాళ్ళతో మాట్లాడి బియ్యం తరలించమని కోరాను. దానికి ఆయన రైల్వే వాళ్ళు బీహార్ కు వ్యగన్లు ఇచ్చారు గానీ తెలంగాణకు ఇవ్వలేదు అని చెప్పారు. వెంటనే నేను cs సోమేష్ కుమార్ కు చెప్పి రైల్వే వాళ్ళ తో మాట్లాడించాను.