ఇప్పుడంటే మొబైల్ లోనే రోజుకి ఎన్ని వీలైతే అన్ని సినిమాలు చూసేస్తున్నాం గానీ, ఇదివరకు కొందరు కనీసం వారానికో సినిమా చూస్తే, మరి కొందరు కనీసం నెలకో సినిమానైనా చూసేవారు. కానీ, ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 30 ఏళ్లపాటు అసలు సినిమాలే చూడకండా వుండగలమా? ముఖ్యంగా సినీప్రియులకు తీసుకునే ఫుడ్, పీల్చుకునే గాలి లాంటిది సినిమా.
అయితే, ఉగ్రవాదం కారణంగా జమ్మూకశ్మీర్లో దాదాపు మూడు దశాబ్దాల క్రితం సినిమా థియేటర్లు మూతబడి, తాజాగా మళ్లీ అందుబాటులోకి వచ్చాయి. పుల్వామా, సోపియాలలో సెప్టెంబర్ 18వ తేదీ, ఆదివారం జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా మల్టీ పర్పస్ సినిమా హాళ్లను ప్రారంభించి సినిమా వీక్షించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… భవిష్యత్లో జమ్మూలోని ప్రతి జిల్లాలో ఇలాంటి మాల్స్ను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. సినిమా థియేటర్లు తిరిగి తెరుచుకోవడం చారిత్రాత్మకమన్న ఆయన, ప్రస్తుతం ప్రారంభించిన సినిమా హాళ్లను పుల్వామా, సోపియా యువతకు అంకితం చేస్తున్నట్టు చెప్పారు. జమ్మూ కశ్మీర్లో త్వరలో మరిన్ని థియేటర్లు అందుబాటులోకి రానున్నాయి. అనంత్నాగ్, శ్రీనగర్, బందిపొరా, గందర్బల్, దోడా, రాజౌరి, ఫూంచ్, కిష్ట్వార్, రియాసీలలో ఇవి ప్రారంభం కానున్నాయి. ఇక్కడ సినిమా ప్రదర్శనతోపాటు ఇన్ఫోటైన్మెంట్, స్కిల్ డెవలప్మెంట్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టు అధికారులు తెలిపారు. అలాగే వచ్చేవారం తొలి ఐనాక్స్ మల్టీప్లెక్స్ ప్రారంభం కానుంది. 520 సీట్ల సామర్థ్యం కలిగిన ఈ థియేటర్ శ్రీనగర్లోని సోమ్వార్ ప్రాంతంలో ఉంది. ఇందులో మూడు స్క్రీన్లు ఉన్నాయి.
జమ్మూ కశ్మీర్లో 1980 వరకు సినిమా థియేటర్లు ఉండేవి. అయితే, ఆ తర్వాత ఉగ్రవాదం పెచ్చుమీరడంతో 1990 దశకంలో సినిమా హాళ్లన్నీ మూతపడ్డాయి. దీంతో జమ్మూ కశ్మీర్ ప్రజలు వినోదానికి దూరమయ్యారు. ఆ తర్వాత మళ్లీ వాటిని తెరిచేందుకు అధికారులు ప్రయత్నించారు. అయితే, 1999లో శ్రీనగర్లోని లాల్చౌక్లో ఉన్న రీగల్ థియేటర్పై ఉగ్రవాదులు గ్రనేడ్ దాడికి దిగడంతో ఆ ప్రయత్నం విఫలమైంది. ఇక అప్పటి నుంచి జమ్మూ కశ్మీర్ ప్రజలకు వినోదం అందుబాటులో లేకుండా పోయింది. సో, ఇప్పుడు జమ్మూ కష్మీర్ ప్రజలు కూడా మనలా ఎంచక్కా సినిమాల్ని చూసి ఎంజాయ్ చేయవచ్చు.