Nara Lokesh Fire On Ycp తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కుప్పంలో నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్లపై దాడి జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే దీనిఫై తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మండిపడ్డారు. ఈ సంఘటనలు సీఎం జగన్ రెడ్డి రాజకీయ దిగజారుడుతనానికి నిదర్శనం అని ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లా కుప్పం ఆర్టీసీ బస్టాండ్ కూడలి వద్ద 86 రోజులుగా నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్పై వైకాపా వారు అర్ధరాత్రి దాడి చేసి ధ్వంసం చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. అధికారంలోకి రాగానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 201 అన్న క్యాంటీన్లను సీఎం జగన్ రద్దు చేశారని, పేద వాడి నోటి దగ్గర కూడు లాక్కుంటున్నారని మండిపడ్డారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా అన్న క్యాంటీన్లు నిర్వహించి తీరుతామని తేల్చిచెప్పారు. అన్న క్యాంటీన్పై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇదీ జరిగింది… ఏపీలోని చిత్తూరు జిల్లా కుప్పం పట్టణంలో ఆర్టీసీ బస్టాండ్ కూడలి వద్ద తెదేపా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్ను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. అక్కడ ఎన్టీఆర్ విగ్రహం వద్ద బ్యానర్లను చించేశారు. షామియానాను చించి ధ్వంసం చేశారు. ఇటీవల తెదేపా అధినేత చంద్రబాబు కుప్పం పర్యటన సందర్భంగా వైకాపా-తెదేపా వర్గాల మధ్య ఘర్షణ పూరిత వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. వైకాపా శ్రేణులు పట్టణంలో ర్యాలీ నిర్వహించిన సందర్భంలో అన్న క్యాంటీన్ను ధ్వంసం చేశారు. మళ్లీ దాన్ని పునరుద్ధరించగా ఇప్పుడు దుండగులు మరో సారి దాడి చేశారు. మరోవైపు కుప్పం పట్టణంలో ఆర్అండ్బీ గెస్ట్హౌస్ వద్ద చంద్రబాబు ఫ్లెక్సీని గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు.
ఏఆర్ కానిస్టేబుల్ డిస్మిస్పై నారా లోకేశ్.. నిరంకుశ ప్రభుత్వంపై పోరాడిన కానిస్టేబుల్ ప్రకాశ్ను నారా లోకేశ్ ప్రశంసించారు. సేవ్ ఏపీ పోలీస్ అనే అధికారం ఎస్సీ కానిస్టేబుల్కు లేదా అని అన్నారు. రాష్ట్రంలో ఎస్సీలపై దమనకాండ కొనసాగుతోందని ధ్వజమెత్తారు. కానిస్టేబుల్ ప్రకాశ్ ఉదంతమే అందుకు ఉదాహరణ అన్నారు. పోలీసులకు రావాల్సిన బకాయిల గురించి మాట్లాడితే వేటు వేస్తారా? అని ప్రశ్నించారు. కానిస్టేబుల్ ప్రకాశ్ను విధుల్లోకి తీసుకోవాలని నారా లోకేశ్ డిమాండ్ చేశారు. పోలీసుల పెండింగ్ బకాయిలు విడుదల చేయాలన్నారు.