Politics ఎఫ్ఆర్బీఎం రుణపరిమితి పేరుతో కేంద్రం రాష్ట్రాలను ఇబ్బంది పెడుతోందని మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. ప్రజలపై భారం పడకుండా ఆదాయం పెంచుకునే మార్గాలు చూస్తున్నామని తెలిపారు. కేంద్రం ఎన్ని ఇబ్బందులు పెట్టినా అభివృద్ధిలో ముందుకెళ్తున్నామన్న ఆయన.. బాధ్యతగానే అప్పులు చేస్తున్నామని.. ఎక్కడా నిర్లక్ష్యం లేదని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే సంపదను కేంద్రం మాదిరి తాము మిత్రులకు పంచలేదని.. పేదలకు పంచామని హరీశ్రావు కేంద్రంపై ధ్వజమెత్తారు.
తెలంగాణకు రావాల్సిన నిధులను కేంద్రం నిలిపివేసి.. రాష్ట్రానికి అన్యాయం చేస్తోందని మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. ఎఫ్ఆర్బీఎం రుణపరిమితి పేరుతో రాష్ట్రాలను ఇబ్బంది పెడుతుందని ఆక్షేపించారు. రాష్ట్రాలను సంప్రదించకుండా కోతలు ఎలా విధిస్తారని ప్రశ్నించారు. ఈ మేరకు అసెంబ్లీలో మంత్రి హరీశ్రావు మాట్లాడారు. రాష్ట్ర వాటా 42 శాతానికి పెంచామని కేంద్రం చెబుతోందన్న ఆయన.. వాస్తవానికి రాష్ట్రానికి వచ్చిన వాటా 29.6 శాతమే అని తెలిపారు. మన రాష్ట్రానికి రూ.33,712 కోట్ల నష్టం జరిగిందని ఆరోపించారు. సంపదను కేంద్రం మాదిరి తాము మిత్రులకు పంచలేదని.. పేదలకు పంచామని స్పష్టం చేశారు.
కేంద్ర ప్రభుత్వం చేసే పనుల వల్ల ఎవరు బాగుపడ్డారని.. రాష్ట్రంలోని వెనుకబడిన జిల్లాలకు ఇవ్వాల్సిన రూ.1,350 కోట్లు పెండింగ్ పెట్టారని ఆరోపించారు. వ్యాట్ ఉంటే రాష్ట్రానికి ఎక్కువ ఆదాయం వచ్చేదన్న ఆయన.. జీఎస్టీ వల్ల తెలంగాణకు నష్టమే ఎక్కువ అన్నారు. రాష్ట్ర అప్పుల్లో కలిపి జీఎస్టీ పరిహారం ఇచ్చారని తెలిపారు. ప్రజలపై భారం పడకుండా ఆదాయం పెంచుకునే మార్గాలు చూస్తున్నామన్న హరీశ్రావు.. కేంద్రం ఎన్ని ఇబ్బందులు పెట్టినా అభివృద్ధిలో ముందుకెళ్తున్నామని స్పష్టం చేశారు. బాధ్యతగానే అప్పులు చేస్తున్నామని.. ఎక్కడా నిర్లక్ష్యం లేదని వివరించారు. సకలజనుల లబ్ధి కోసమే ఈ ప్రభుత్వం పనిచేస్తోందని హరీశ్రావు స్పష్టం చేశారు.