Education : తెలంగాణ రాష్ట్రంలో బీటెక్, ఎంటెక్ కోర్సుల ఫీజులను రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. తెలంగాణ అడ్మీషన్స్ అండ్ ఫీ రెగ్యూలేటరీ కమిటీ (టీఏఎఫ్ఆర్సి) సిఫార్సుల మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని ప్రకటించింది. టీఏఎఫ్ఆర్సీ సిఫారసు మేరకు రాష్ట్రంలోని 159 ఇంజినీరింగ్ కాలేజీల్లో ఫీజులను ఖరారు చేసినట్లు సమాచారం అందుతుంది. అలానే ఎంటెక్ అందుబాటులో ఉన్న 76 కాలేజీలకు కూడా ఫీజును నిర్ణయించింది. ఈ మేరకు తాజాగా ప్రభుత్వం జీవో జారీ చేసింది.
ఈ తాజా ఉత్తర్వుల ప్రకారం ఇంజినీరింగ్ కాలేజీల్లో కనీస రుసుమును రూ. 45 వేలకు పెంచింది. ఎంటెక్ కనీస వార్షిక రుసుము రూ. 57 వేలుగా ఖరారు చేసింది. కాగా, ప్రభుత్వం జారీ చేసిన తాజా జీవోతో రాష్ట్ర వ్యాప్తంగా 40 కాలేజీల్లో ఇంజనీరింగ్ ఫీజు లక్ష రూపాయలు దాటింది. ఎంజీఐటీ రూ.1.60లక్షలు, సీవీఆర్ రూ.1.50లక్షలు, సీబీఐటీ, వర్ధమాన్, వాసవీ రూ.1.40లక్షలు ఖరారు చేశారు. ఈ కొత్త ఇంజినీరింగ్ ఫీజులు మూడేళ్ల పాటు అమలులో ఉండనున్నాయి. ఎల్లుండి నుంచి ఇంజినీరింగ్ తుది విడత కౌన్సిలింగ్ నిర్వహించనున్నారు.
అయితే, ఫీజు రీఎంబర్స్మెంట్ పెంపుపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు సర్కార్. దాంతో పెరిగిన పీజుల భారం ఆయా రిజర్వేషన్ కలిగిన విద్యార్థులపై పడనుంది. బీటెక్, ఎంటెక్ కోర్సులతో పాటు ఎంబీఏ, ఎంసీఏ కాలేజీల ఫీజులు కూడా ప్రభుత్వం పెంచింది. ఈ పెరిగిన ధరలు 2022-23, 2023-24, 2024-25 అకడమిక్ ఇయర్స్లో అమల్లో కానున్నాయి. ఇరు తెలుగు రాష్ట్రాల్లో విద్యార్ధులు వారి వారి సౌలభ్యాన్ని బట్టి తెలంగాణ వారు ఏపీ లోనూ , ఏపీ వారు తెలంగాణ లోనూ జాయిన్ అవుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ మేరకు ఏపీలోని కొంతమంది విద్యార్దులు కూడా ఈ జీవో కోసం కొంతకాలంగా ఎదురుచూస్తున్నారు.