విక్టరీ వెంకటేష్ హీరోగా, జీతూ జోసెఫ్ దర్శకత్వంలో రాబోతోన్న దృశ్యం 2 చిత్రాన్ని ఆంటోని పెరంబవూర్, రాజ్ కుమార్ సేతుపతి, సురేష్ బాబు కలిసి సురేష్ ప్రొడక్షన్స్, రాజ్ కుమార్ థియేటర్స్ అండ్ మ్యాక్స్ మూవీస్ బ్యానర్ల మీద సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సూపర్ హిట్ థ్రిల్లర్ దృశ్యం సినిమాకు సీక్వెల్గా ఈ చిత్రం నవంబర్ 25న రాబోతోంది. సినిమా ప్రమోషన్స్లో భాగంగా చిత్రయూనిట్ మీడియాతో ముచ్చటించింది
వెంకటేష్ మాట్లాడుతూ.. ‘ఈరోజు దృశ్యం 2 ట్రైలర్ లాంచ్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. దృశ్యం-1 తర్వాత అలాంటి సినిమా చేయాలని అనుకున్నాను. జీతూ దృశ్యం-2 తో నా వద్దకు వచ్చారు. అది మలయాళంలో చాలా పెద్ద హిట్. మీ అందరికి తెలిసిందే. ప్రేక్షకులు అందరు ఈ సినిమాను అదరిస్తారనే నమ్మకం ఉంది. దృశ్యం 2 చెసేటప్పుడు ఎలాంటికి ఒత్తిడికి గురికాలేదు. జీతూ స్క్రిప్ట్ చూశాక అలాంటిదేమి అనిపించలేదు. దృశ్యం 1 తర్వాత ప్రేక్షకులు అలాంటి సినిమా కోసం ఎదురుచూశారు. మలయాళంలో మోహన్లాల్, మీనా అద్భుతంగా చేశారు. తెలుగులో టీమ్ అంతా చాలా కష్టపడి.. అద్భుతంగా చేశారు. సినిమా నేను చూశాను.. చాలా బాగా వచ్చింది.
ఇలాంటి ఫ్యామిలీ థ్రిల్లర్ ఈ మధ్యకాలంలో రాలేదు. రాంబాబు క్యారెక్టర్ బాగా నచ్చుతుంది. ఈ సినిమాలో వర్క్ చేసేటప్పుడు చాలా ఎంజాయ్ చేశాను. నేను కొత్త రకం సినిమాలు చేసినప్పుడు ప్రేక్షకులు ఎప్పుడు అదరిస్తూనే వచ్చారు. రాంబాబు లాంటి తండ్రి ప్రతి ఇంట్లో ఉండాలి. ఏ పరిస్థితుల్లో ఉన్నా తన ఫ్యామిలీని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఆరేళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు వస్తున్నాం. ఆ పాత్రల్లో ఇప్పటికీ ఓ కనిపించని భయం.. ఆరేళ్ల తర్వాత విచారణ ప్రారంభం కావడం.. చాలా థ్రిలింగ్గా ఉంటుంది సినిమా. అలాంటి క్యారెక్టర్స్ చాలా డిఫరెంట్గా అనిపించింది. ఆ ప్రాబ్లమ్ నుంచి ఎలా బయటపడతామనేది జీతూ చాలా బాగా చూపించాడు. అలాంటి స్క్రిప్ట్ చూసి ఉండరు. నెక్స్ట్ ఏం జరుగుతుందనేది ఎవరూ గెస్ చేయలేరు. చాలా ట్విస్ట్లు, మలుపులు ఉంటాయి. చాలా ఎమోషనల్గా ఉంటుంది. నా విషయానికి వస్తే..సెట్కు వెళ్లగానే రాంబాబు వచ్చేస్తాడు. ఆ క్యారెక్టర్లో బ్యూటీ అలాంటిది. ఒరిజినల్ క్యారెక్టర్ చేసిన మోహనలాల్ను చూసి స్టన్ అయ్యాను. చాలా సీన్స్ నా హృదయానికి దగ్గరగా ఉన్నాయి. కోవిడ్ కారణంగా ఒక్క చిన్న టౌన్లో ఉండి.. సింగిల్ షెడ్యూల్లో పూర్తి చేశాం’ అని అన్నారు.