Director Teja :డైరెక్టర్ తేజ అందరికి సుపరిచితమే. చిత్రం(Chitram), నువ్వు నేను(Nuvvu Nenu), జయం(Jayam).. లాంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలను అందించారు డైరెక్టర్ తేజ. చివరిసారిగా బెల్లంకొండ శ్రీనివాస్(Bellamkonda Srinivas) తో సీత(Sitha) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు తేజ. ఇప్పుడు చాలా గ్యాప్ తర్వాత అహింస సినిమాతో రాబోతున్నాడు. ప్రముఖ నిర్మాత సురేష్ బాబు తనయుడు, రానా(Rana) తమ్ముడు అభిరామ్(Abhiram) ని పరిచయం చేస్తూ అహింస(Ahimsa) సినిమాతో జూన్ 2న రాబోతున్నాడు. ప్రస్తుతం చిత్రయూనిట్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు.
ఈ ప్రమోషన్స్ లో భాగంగా డైరెక్టర్ తేజ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సినిమాలకు రాకముందు తన లైఫ్ గురించి చెప్పాడు. ముక్కుసూటిగా మాట్లాడే తేజ లైఫ్ వెనక ఇంత విషాదం ఉందా అని అంతా ఆశ్చర్యపోతున్నారు. తేజ మాట్లాడుతూ.. చిన్నప్పుడే మా అమ్మ ఆరోగ్యం బాగోలేక చనిపోయింది. ఆ దిగులుతో మా నాన్న కూడా చనిపోయారు. నేను, అక్క, చెల్లి ముగ్గురం ఉండేవాళ్ళం. మాకు ఆస్తులు కూడా చాలా ఉండేవి. మా పేరెంట్స్ చనిపోయాక మా చుట్టాలు మా ఆస్తులను, మమ్మల్ని పంచుకున్నారు. ఓ రోజు నన్ను బయట పడుకోమన్నారు మా చుట్టాలు. అప్పుడే అర్థమైంది వాళ్ళు నన్ను చూడరని. దీంతో ఎవరికీ చెప్పకుండా పారిపోయి వచ్చేశాను. ఫుట్పాత్ మీద ఆకలితో పడుకున్న రోజుల నుంచి ఇప్పుడు ఈ స్టేజిలో ఉన్నాను అంటే కారణం సినిమా వల్లే. నాకు సినిమానే అంతా ఇచ్చింది అని తెలిపారు. ఇంత సక్సెస్ సాధించిన డైరెక్టర్ తేజ వెనుక ఇంత విషాదం ఉందా అని బాధపడుతూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు ప్రేక్షకులు.
డైరెక్టర్ అవ్వకముందు తేజ ఒక స్టార్ సినిమాటోగ్రాఫర్. రాత్రి, మనీ, అంతం.. లాంటి పలు తెలుగు సినిమాలతో పాటు హిందీలో కూడా దాదాపు 10 సినిమాలకు పైగా కెమెరామెన్ గా పనిచేశాడు తేజ. ఆర్జీవీ దగ్గర దర్శకత్వంలో అసిస్టెంట్ గా పనిచేసిన తేజ ఆ తర్వాత ఆయన సినిమాలకే కెమెరామెన్ గా పనిచేసి, ఆ తర్వాత దర్శకుడిగా మారాడు.