CM Jagan : నేడు ప్రపంచ ప్రపంచ మత్స్యకార దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్రంలో పలు అభివృద్ది కార్యక్రమాలకు సీఎం జగన్ మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో జగన్ పర్యటించనున్నారు. స్థానికంగా ఏర్పాటు చేసిన సభలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించనున్నారు. ఈ మేరకు ఉదయం 10 గంటలకు సీఎం వైఎస్ జగన్ తాడేపల్లి నివాసం నుంచి బయలురి.10.50 నిమిషాలకు నరసాపురం చేరుకుంటారు. 11:15ని.ల నుంచి గం. 12.50ని.లవరకు వివిధ అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొంటారు. తర్వాత ఏపీ ఆక్వా యూనివర్సిటీ, బియ్యపుతిప్ప ఫిషింగ్ హార్బర్ కు సీఎం శంకుస్థాపన చేస్తారు. అలాగే మత్స్యకార బహిరంగ సభలో సీఎం జగన్ పాల్గొంటారు.
కాగా నరసాపురం నియోజకవర్గ పర్యటనలో సుమారు 3,197 కోట్లతో చేయనున్న అభివృద్ధి పనులను సీఎం జగన్ ప్రారంభించనున్నారని మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. వీటిలో భాగంగా తమిళనాడు, కేరళ తర్వాత దేశంలో మూడో ఆక్వా యూనివర్సిటీని నరసాపురంలో ప్రభుత్వం స్థాపిస్తుందన్నారు. దీని కోసం 350 ఎకరాల్లో 332 కోట్ల అంచనా వ్యయంతో డీపీఆర్ కు ఆమోదం లభించిందని అన్నారు. అలాగే 490 కోట్లతో వశిష్ట గోదావరి బ్రిడ్జి నిర్మాణం, 429 కోట్లతో ఫిషింగ్ హార్బర్, 1400 కోట్లతో వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్, 133 కోట్లతో విద్యుత్ సబ్ స్టేషన్, 87 కోట్లతో మున్సిపల్ వాటర్ ప్రాజెక్టు, నరసాపురం పట్టణంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం చేపట్టనున్నట్లు వెల్లడించారు.
అలాగే నియోజకవర్గం లోని మోళ్లపర్రులో 180 కోట్లతో ఉప్పుటేరుపై రెగ్యులేటర్ నిర్మాణం, 13కోట్లతో నరసాపురం పట్టణంలో వంద పడకల ఆసుప్రతి నిర్మాణం… 4.80 కోట్లతో ఆధునీకరించిన ఆర్టీసీ క్లాంపెక్స్ ను సీఎం జగన్ ప్రారంభిస్తారని మంత్రి వివరించారు.