వ్యవసాయం, అనుబంధ రంగాలపై తెలంగాణ రాష్ట్రం కంటే ఎక్కువ ఖర్చు చేసిన రాష్ట్రాలు దేశంలో ఏవైనా ఉంటే బహిరంగ చర్చకు రావాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, మున్సిపల్శాఖ మంత్రి కే తారకరామారావు బీజేపీ, కాంగ్రెస్ నేతలకు సవాల్ విసిరారు. తెలంగాణ సర్కారు సీఎం కేసీఆర్ నాయకత్వంలో వ్యవసాయ, అనుబంధ రంగాలపై గత ఏడేండ్లలో రూ.2.70 లక్షల కోట్లు ఖర్చు చేసిందని తెలిపారు. ‘చేసిన అభివృద్ధిపై శ్వేతపత్రాలు విడుదలచేయటంలో పోటీ పడదాం. నల్ల చట్టాలు చేయటంలో కాదు’ అని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ రైతుబంధు ద్వారా పంపిన రూ.50 వేల కోట్ల ముల్లె ప్రతి పల్లెకు చేరిందని పేర్కొన్నారు. తెలంగాణభవన్లో సోమవారం మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్రెడ్డి, జీహెచ్ఎంసీ మేయర్ జీ విజయలక్ష్మి, ఎంపీ రంజిత్రెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. వ్యవసాయ, అనుబంధ రంగాల్లో అభివృద్ధిపై తెలంగాణను అవమానించటం కాదు.. బీజేపీ, కాంగ్రెస్ నేతలు వారి పాలనలో ఉన్న రాష్ర్టాల్లో తెలంగాణ కంటే ఎక్కువ ఏం సాధించారో, ఎక్కువగా ఏం చేశారో చెప్పాలని సవాల్ విసిరారు. ‘తెలంగాణకు వచ్చి ఊకదంపుడు ఉపన్యాసాలివ్వడం కాదు.. శ్వేతపత్రాల్లో పోటీపడుదాం రండి’ అని సవాల్చేశారు.
సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ సందర్భం : స్వాతంత్య్రానంతరం దేశ చరిత్రలో రైతాంగానికి సంబంధించి సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ అద్భుతమైన సందర్భమిది అని రైతుబంధు ద్వారా రైతులకు రూ.50 వేలకోట్లు పంపిణీ పూర్తయిన సందర్భాన్ని మంత్రి కేటీఆర్ అభివర్ణించారు. ‘60 ఏండ్ల రైతుల గోస తీర్చి, 60 శాతం జనతా కష్టాలను తీర్చి, రాష్ట్రంలోని 65 లక్షల మంది రైతులకు బాసటగా నిలిచిన సీఎం కేసీఆర్కు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా, 60 లక్షల మంది కార్యకర్తల పక్షాన, 65 లక్షల రైతు కుటుంబాల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నా’ అని కేటీఆర్ అన్నారు. రైతుబంధు ద్వారా రైతుల ఖాతాల్లో రూ. 50 వేల కోట్లు జమ అయిన సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా రైతుబంధు సంబురాలను జరుపుకోవాలని ఇచ్చిన పిలుపునకు రైతులు, టీఆర్ఎస్ కార్యకర్తలు అద్భుతంగా స్పందించారని, కరోనా నిబంధనలు పాటిస్తూనే కార్యక్రమాల్లో భాగస్వాములై రైతుబంధు స్పూర్తిని చాటారని ప్రశంసించారు. కార్యకర్తలు, నాయకుల విజ్ఞప్తి మేరకు రైతుబంధు సంబురాలను సంక్రాంతి వరకు పొడిగించామని తెలిపారు.
కేసీఆర్ మహా సంకల్పమే రైతుబంధు : దేశ చరిత్రలో ఏ పార్టీ, ఏ నాయకుడు చేయని, మాటలకందని మహా సంకల్పం సీఎం కేసీఆర్ చేశారని, ఆయన మానస పుత్రికే రైతుబంధు అని మంత్రి కేటీఆర్ అన్నారు. టీఆర్ఎస్ అంటేనే తెలంగాణ రైతు సర్కారు అని పార్టీకి కొత్త అర్థాన్ని చెప్పారు. రైతుబంధు రూపంలో 64 లక్షల రైతుల ఖాతాల్లో రూ. 50 వేల కోట్లు జమ కావడం వ్యవసాయ చరిత్రలోనే ఒక సువర్ణాధ్యాయమని అభివర్ణించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రైతుల వెతలు పత్రికల్లో ప్రధాన శీర్షికలు అయ్యేవని, తెలంగాణ స్వయం పాలనలో రైతుల బ్యాంకు ఖాతాలు పతాక శీర్షికలు అయ్యాయని తెలిపారు.
‘తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఈ ప్రాంతంలో రైతులు ఎదుర్కొన్న కష్టాల గురించి ఎంతచెప్పినా తక్కువే. నాడు బోర్ల కింద పంటలు, బోర్లా పడ్డ రైతుల బతుకులు, బోర్ల రాంరెడ్డి వంటి బిరుదులు, ఫెయిల్ అయిన బోర్లే ఇంటి పేర్లుగా మారాయి. ముషంపల్లిలో రాంరెడ్డి అనే రైతు 58 బోర్లు వేస్తే ఆయన ఇంటి పేరు బోర్ల రాంరెడ్డిగా మారింది. ప్రాజెక్టులకు దిక్కులేదు. రైతు బతుక్కు భరోసా లేదు. ఆనాడు ఛిద్రమైన బతుకులు, చితికిపోయిన జీవితాలు’ అని కేటీఆర్ గుర్తుచేశారు.నాలుగు రకాల విప్లవాలు
సస్య విప్లవం : రెండో హరిత విప్లవం. పుట్లకొద్ది ధాన్యం రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా కనపడుతున్నది.
గులాబీ విప్లవం : మాంసం ఉత్పత్తిలో విప్లవం. రాష్ట్రంలో 2014తో పోలిస్తే 2020 నాటికి 106 శాతం మాంసం ఉత్పత్తి పెరిగింది. 3.88 లక్షల లబ్ధిదారులకు రూ.4,914 కోట్లతో 81.06 లక్షల గొర్రెలను పంపిణీచేశాం. ఇందులో ప్రభుత్వ సబ్సిడీ రూ.3,685 కోట్లు.
శ్వేత విప్లవం : విజయ డెయిరీ నష్టాల బాట నుంచి లాభాల బాట పట్టింది. ప్రభుత్వానికి డివిడెండ్ ఇచ్చే స్థాయికి వచ్చింది.
నీలి విప్లవం : 2016 నుంచి రూ.19,398 కోట్లతో 353 కోట్ల చేప పిల్లలు పంపిణీచేశాం. ఇప్పుడు ప్రతి గ్రామంలో చేపలు దొరుకుతున్నాయి.
60 ఏండ్ల రైతుల గోస తీర్చి, 60 శాతం జనత కష్టాలను తీర్చి, రాష్ట్రంలోని 65 లక్షల మంది రైతులకు బాసటగా నిలిచిన సీఎం కేసీఆర్కు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా, 60 లక్షల మంది కార్యకర్తల పక్షాన, 65 లక్షల రైతు కుటుంబాల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నా.
• మంత్రి కేటీఆర్