కాపుల అభ్యున్నతికి తూట్లు పొడుస్తూ వైసీపీ ప్రభుత్వం కాపుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని భారత రాష్ట్ర సమితి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు డాక్టర్ తోట చంద్రశేఖర్ అన్నారు. హైదారాబాద్ లో కాపు భవన్ నిర్మాణానికి అవసరమైన 6.87 ఎకరాల స్థలం కేటాయింపుకు చొరవ చూపిన తోట చంద్రశేఖర్ ను శ్రీ కృష్ణ దేవరాయ సేవా సంఘం, కాపు సంక్షేమసేన, కాపునాడు సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు.
ఈ సంధర్భంగా తోట మాట్లాడుతూ… నాలున్నారెళ్ళ వైసీపీ పాలనలో ఆంధ్ర రాష్ట్రం అధోగతి పాలైందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర జనాభాలో అత్యధికంగా 1.25 మంది కాపులు ఉండగా వారికి ఎటువంటి సంక్షేమ ఫలాలు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సామాజిక, ఆర్ధిక, విద్యా,ఉపాధి రంగాల్లో కాపులు వెనకబాటుకు గురౌతున్నారని తన బాధను వ్యక్తం చేశారు. తెలంగాణ సిఎం కేసిఆర్ కాపులకు పెద్ద పీట వేస్తూ హైదారాబాద్ నగరంలోని హైటెక్ సిటీ సమీపంలో సౌత్ ఇండియా సెంటర్ ఫర్ కాపు కమ్యూనిటీ భవన్ కు అత్యంత విలువైన 6- 87 ఎకరాల స్థలాన్ని కేటాయించి కాపుల పట్ల తనకున్న చిత్తశుద్దిని చాటుకున్నారని కొనియాడారు.
ఎపి లో కాపు కార్పొరేషన్ను నిర్వీర్యం చేసిన వైసీపీ సర్కార్ అవసరమైన నిధులు కేటాయించకుండా కాపులకు నమ్మక ద్రోహం చేసిందని ఆరోపించారు . తెలంగాణ ప్రభుత్వం తరహాలో కాపులకు ఆకాంక్షలకణుగుణంగా రాజధాని ప్రాంతంలో కాపు సంక్షేమ భవన నిర్మాణం కోసం వైసీపీ ప్రభుత్వం ఐదు ఎకరాల స్థలం కేటాయించాలని తోట డిమాండ్ చేశారు. తొలుత కాపు సంఘాల ప్రతినిధులు డాక్టర్ చంద్రశేఖర్ సేవలను కొనియాడి గజమాలతో సత్కరించారు.
ఈ కార్యక్రమంలో కాపు సంఘ నేతలు డాక్టర్ ఇమడాబత్తిన కృష్ణమూర్తి, పాకనాటి రమాదేవి, మామిడి రామారావు, మిరియాల శ్రీనివాస్, కొప్పరాజు మారుతి కిషోర్, కొత్తకోట ప్రసాద్, డేగల వెంకటేశ్వరరావు, దార్ల మహేష్, ఇంకొల్లు శంకరరావు, కఠారి శ్రీను, బొక్కిసం శివరాం, ఏపూరి రమణయ్య, వరికూటి శ్రీనివాసరావు, మంచాల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.