ప్రజలకు ఉచిత పథకాలను అందించడం ఇప్పుడు కొత్తగా వున్నది కాదు. ఎప్పటినుండో వస్తున్నదే. అయితే, ముఖ్యంగా ఎన్నికలకు ముందు ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు అన్ని రాజకీయ పార్టీలు ఉచిత పథకాల పేరుతో ఎర వేయడం మామూలే. కాకపోతే, తీరా ఒక పార్టీ గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తరువాత తప్పనిసరై తమ ప్రభుత్వ మనుగడ కోసం ఉచిత పథకాలను ప్రవేశపెట్టి కొనసాగిస్తూంటాయి. అయితే, ఇది తీవ్రమైన ఆర్థిక సంక్షోభానికి దారి తీస్తుందని కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. శ్రీలంక ఎలాంటి ఆర్థికపరమైన సంక్షోభానికి గురైందీ ప్రత్యక్షంగా చూస్తున్నప్పటికీ ప్రభుత్వాల విధానంలో మార్పు రావడం లేదు. కొన్ని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ఋణాలను నిలిపి వేయడం కూడా మనం చూశాం.
ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం రాజస్థాన్లోని అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం ఇప్పటి నుంచే పావులు సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా ఓ సరికొత్త పథకాన్ని తెరపైకి తీసుకొచ్చింది. రాష్ట్రంలో అర్హులైన 1.35కోట్ల మంది మహిళలకు ఉచితంగా సెల్ఫోన్లు పంపిణీ చేయడంతోపాటు మూడేళ్లపాటు ఉచితంగా ఇంటర్నెట్ సదుపాయం కూడా ఇవ్వనున్నట్టు తెలిపింది. ఈ ఏడాది బడ్జెట్లో డిజిటల్ సేవా యోజన పథకాన్ని సీఎం గెహ్లాట్ ప్రకటించారు. అందులో భాగంగానే తాజాగా ఈ ప్రకటన చేశారు. ఈ కొత్త పథకం కోసం మొత్తం రూ.12 కోట్లు ఖర్చవుతుందని అంచనా.
ఈ పథకంలో భాగంగా చిరంజీవి హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ పేరిట ప్రభుత్వ అందిస్తున్న ఆరోగ్య బీమా పథకంలో చేరిన కుటుంబాల్లోని మహిళలకు ఉచిత సెల్ఫోన్లు అందిస్తారు. అంతేకాదు, మూడేళ్లపాటు ఉచితంగా ఇంటర్నెట్ కూడా అందిస్తారు. అర్హులైన వారిని 1.35 కోట్లుగా లెక్క తేల్చారు. డ్యూయల్ సిమ్ ఫోన్లు అయిన ఇందులో ఓ సిమ్కార్డ్ లాక్ చేసి ఉంటుంది. రెండో స్లాట్లో మాత్రం మరో కార్డు వేసుకోవచ్చు. ఈ పథకంలో భాగంగా సేవలు అందించేందుకు టెలికం సంస్థల నుంచి బిడ్లు ఆహ్వానించింది. ఈ నెలాఖరుకల్లా బిడ్లను ఖరారు చేయనున్నారు. బీఎస్ఎన్ఎల్ సహా మూడు ప్రైవేటు టెలికం కంపెనీలు పోటీలో ఉన్నాయి. బిడ్ ఏ కంపెనీకి దక్కినా ఆ టెలికం ఖాతాలో 1.35 కోట్ల మంది సబ్స్క్రైబర్లు చేరినట్టే.