ఎన్నికల్లో ఓటు ఎవరు, ఎవరికి వేయాలి? స్థానికంగా నివసించేవారు సదరు పోటీ చేస్తున్న నాయకుల్లో తమకు నచ్చినవారికి ఓటు వేసి ఎన్నుకోవాలి. ఇది స్థూల సూత్రం. ఎక్కడో నివసించేవారు ఇక్కడికొచ్చి ఓటేసి తిరిగి వెళ్లిపోవడమనేది అర్థ రహితం. కానీ, జమ్మూ కశ్మీర్లో స్థానికేతరులకు కూడా ఓటు హక్కు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఇది ముమ్మాటికి బీజేపీకి లబ్ధి చేకూర్చే పనేనని ఆరోపిస్తున్నాయి. జమ్మూ కశ్మీర్లో పనిచేస్తున్న స్థానికేతరులైన ఉద్యోగులు, విద్యార్థులు, కార్మికులు సహా అక్కడ నివసించే స్థానికేతరులకు ఓటు హక్కు కల్పించాలని ముఖ్య ఎన్నికల అధికారి హిర్దేశ్ కుమార్ నిర్ణయించారు.
ఓటు హక్కు కోసం వీరందరూ దరఖాస్తు చేసుకుని జమ్మూ కశ్మీర్లో జరిగే ఎన్నికల్లో ఓటు వేయవచ్చని పేర్కొన్నారు. వారందరూ ఇక్కడే వుండాలన్న నియమం ఏమీ లేదని, కాబట్టి ఓటు హక్కు కోసం వారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అంతేకాదు, జమ్మూ కశ్మీర్లో సేవలందిస్తున్న సాయుధ భద్రతా బలగాల్లోని స్థానికేతరులు కూడా ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.
అయితే, ఈసీ నిర్ణయాన్ని మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ సహా ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. బీజేపీకి లబ్ది చేకూర్చేందుకే ఈసీ ఈ నిర్ణయం తీసుకుందని ఆరోపించారు. రాష్ట్రంలో ఎన్నికలను వాయిదా వేసేందుకు, బీజేపీ అనుకూల ఓటర్ల సంఖ్యను పెంచడమే ఇందులో భాగమని ముఫ్తీ విమర్శించారు. స్థానికేతరులకు ఓటుహక్కు కల్పిస్తే అది ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపుతుందన్నారు. బీజేపీ అనుకూల ఓటర్లను ‘దిగుమతి’ చేసుకునేందుకు ప్రభుత్వం కావాలనే ఈ నిర్ణయం తీసుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
స్థానికులను నిర్వీర్యం చేసి ఉక్కు పిడికిలితో పాలించడమే దీని వెనకున్న లక్ష్యమని ముఫ్తీ ఆరోపించారు. మరి, ఈ విషయంలో ప్రజల భావన ఏమిటో ఇంకా తెలియరాలేదు. వారు ప్రభుత్వ నిర్ణయిస్తారా లేక ప్రతిపక్షాల భావనకు మద్ధతిస్తారా అనేది వేచి చూడాల్సిందే.